పవార్ పవరే వేరప్పా!

రాజకీయాలు.. వివాదాలు.. ఆస్తులు.. ఆటలు.. అన్నీ కలిస్తే శరద్‌ పవార్‌. దేశ రాజకీయాల్లో పవార్‌ది ప్రత్యేక పాత్ర. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. 37 ఏళ్లకే మహారాష్ట్ర సీఎం పీఠమెక్కారు. కాంగ్రెస్‌లో ఉండి ఏకంగా సోనియా గాంధీ జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాలు-విమర్శలు ఎన్ని ఎదురైనా దీటుగా ఎదుర్కొన్నారు.
పూర్తి పేరు: శరద్‌ చంద్ర గోవింద్‌రావ్‌ పవార్‌
జననం: 1940 డిసెంబరు 12న బారామతిలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో
తొలి విజయం: 1967లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా (కాంగ్రెస్‌)
**తొలిసారి సీఎం పీఠంపై..
పవార్‌ 1978లో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తొలిసారిగా సీఎం పదవిని అలంకరించారు. కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరిలో పీడీఎఫ్‌ ప్రభుత్వం రద్దయింది. 1983లో కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) పార్టీ అధ్యక్ష బాధ్యతలను పవార్‌ స్వీకరించారు. 1984లో బారామతి నుంచి ఎంపీగా గెలిచారు. మరుసటి ఏడాది అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) 54 సీట్లు దక్కించుకోవడంతో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు.
**శివసేనకు కళ్లెం వేసే బాధ్యత
1987లో పవార్‌ కాంగ్రెస్‌(ఐ) గూటికి చేరుకున్నారు. మహారాష్ట్రలో శివసేన పట్టు పెరగకుండా చూసే బాధ్యతను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. దాన్ని నిర్వర్తించడంలో చాలావరకు సఫలమయ్యారు! 1988లో అప్పటి మహారాష్ట్ర సీఎం శంకర్‌రావు చవాన్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా రాజీవ్‌ గాంధీ తన మంత్రిమండలిలోకి తీసుకోవడంతో పవార్‌ తిరిగి సీఎం అయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపా-శివసేనల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్‌కు 141 సీట్లు వచ్చాయి. దీంతో 12 మంది స్వతంత్రుల మద్దతుతో పవార్‌ మళ్లీ సీఎం పీఠమెక్కారు.
ప్రధాని పదవి రేసులో..
రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి రేసులో పవార్‌ నిలిచారు. ఆయనతోపాటు పీవీ నరసింహారావు, ఎన్డీ తివారీ పేర్లను కాంగ్రెస్‌ పరిశీలించింది! చివరకు పీవీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా.. పవార్‌ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆపై మహారాష్ట్ర సీఎం పదవి నుంచి సుధాకర్‌రావు నాయక్‌ దిగిపోవడంతో దేశ రాజకీయాల్లో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తిరిగి పవార్‌ను ముఖ్యమంత్రిగా చేశారు పీవీ.
**ఎన్సీపీ స్థాపన
12వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పవార్‌ పనిచేశారు. 1999లో ఆ సభ రద్దయ్యాక.. సోనియా గాంధీని కాకుండా భారత్‌లో పుట్టిన ఇతర నేతనెవరినైనా ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించాలని పవార్‌, పి.ఎ.సంగ్మా, తారిక్‌ అన్వర్‌ డిమాండ్‌ చేశారు. సోనియా జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే ఏడాది జూన్‌లో పవార్‌, సంగ్మా కలిసి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)ని స్థాపించారు. 2004లో తిరిగి యూపీయేలో చేరిన పవార్‌.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
**ఆటలతో అనుబంధం
పవార్‌కు క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, మహారాష్ట్ర రెజ్లింగ్‌, కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి నేతృత్వం వహించారు.
**లెక్కలేనన్ని వివాదాలు
పవార్‌ తన రాజకీయ జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎంగా ఉండి నేరగాళ్లను రక్షించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో పవార్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పన్ను మినహాయింపు వంటి వ్యవహారాల్లో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆస్తుల ప్రకటనలో పవార్‌ పారదర్శకత పాటించలేదనే ఆరోపణలున్నాయి.
**వారసత్వం
పవార్‌ కుమార్తె సుప్రియా సూల 16వ లోక్‌సభ సభ్యురాలు. 2009, 2014 ఎన్నికల్లో బారామతి నుంచి ఎంపీగా ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
**పద్మ విభూషణ్‌
మనదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ 2017లో పవార్‌ను వరించింది.
ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపై నడిపించడంలో పవార్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్‌ పొత్తుకు ఇది కూడా ఒక కారణం.

ఎంపీలకు ఎన్ని సౌకర్యాలో!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం పార్లమెంటు. స్వాతంత్ర్య వచ్చిన తరువాత 1952లో ఏర్పాటైన తోలిసభ నాటి నుండి నేటి వరకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సగౌరవంగా నిలబడింది. పార్లమెంటులోని ఉభయ సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా జీవనానిక్ ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అలాంటి ప్రజాప్రతినిధిలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పించింది. ప్రతి పార్లమెంటు సభ్యుడి పరిధి పలు జిల్లాలో విస్తరించి ఉంటుంది. కావున స్థానికంగా సౌకర్యాల కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేస్తే నెలకు రూ.45వేలు చెల్లిస్తారు. దీంతో పాటు సమావేశాల నిర్వహణకు మరో రూ. 45వేలు ఇస్తారు. దీంతో పాటు స్టేషనరీ ఖర్చుల కోసం రూ. పదిహేను వేలు అందుతాయి. పీఏను నియమించుకుంటే రూ. ముప్పై వేల వేతనం చెల్లిస్తారు. ఎంపీలకు రూ. యాభై వేలు ఉన్న వేతానని గతేడాది నుంచి రూ. లక్షకు పెంచారు. సభ్యుడికి నెలకు రూ.పాతిక వేల పెన్షన్ అందజేస్తారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభకు హాజరైన సభ్యుడికి రోజుకు రూ. రెండు వేలు చెల్లిస్తారు. పార్లమెంటు సభ్యుడు ఇష్టమైన చోట నివాసం ఉండొచ్చు. ఈఅద్దె అలవెన్సులు కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. పదవీకాలం ముగిసిన ఒక నెల ఉండొచ్చు. ఇంటి సామగ్రి కొనుగోలుకు వడ్డీ లేకుండా రూ.4 లక్షల రుణం ఇస్తారు. ఇల్లు, కార్యాలయం నిర్వహణకు ప్రతి మూడు నెలలకోసారి రూ.75 వేలు చెల్లిస్తారు. ఏడాదికి 50 వేల లీటర్ల నీళ్లు, 50 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా వాడుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. ఎంపీని కలిసేందుకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఢిల్లీలోని వెస్ట్‌కోర్టు వసతి గృహం, జన్‌పథ్‌లో వసతి పొందవచ్చు. ప్రతి ఎంపీ మూడు టెలిఫోన్‌ కనెక్షన్లను వినియోగించుకోవచ్చు. ప్రతి ఫోన్‌ నుంచి 50 వేల కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. ఇందులో రెండు 3జీ కనెక్షన్‌లు ఉంటాయి. ప్రతి ఎంపీ వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో క్లాస్‌–1 చికిత్స పొందవచ్చు. ఎంపీలకు అందించే అన్ని రకాల వసతులు, నిర్వహణ ఖర్చులు ఆదాయపన్ను పరిధిలోకి తీసుకోరు. పార్లమెంట్‌ సభ్యుడు తన విధి నిర్వహణలో ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా ఉచిత రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. రోడ్డు మార్గంలో అయితే ప్రతి కిలోమీటరుకు రూ.16 చొప్పున చెల్లిస్తారు. రైలు ప్రయాణంలో ఎంపీతోపాటు అతని భార్య, లేదా భర్తతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఏసీతో పాటు రెండో తరగతి చార్జీలు చెల్లిస్తారు. విమానంలో అయితే ఏడాదిలో 34 సార్లు ప్రయాణించే సదుపాయం పార్లమెంట్‌ సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తుంది.

అంబేద్కర్‌నే రెండుసార్లు ఓడించిన దేశం మనది

లోక్‌సభలో అడుగుపెట్టాలన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కలలు కలలుగానే మిగిలిపోయాయి. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ ఫెడరేషన్‌ తరఫున అప్పటి ఉత్తర బొంబయి(రిజర్వ్డు) స్థానం నుంచి అంబేడ్కర్‌ పోటీకి దిగారు. గతంలో అంబేడ్కర్‌ సహాయకుడైన నారాయణ్‌ సడోబా కజ్రోల్కర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. నారాయణ్‌ చేతిలో అంబేడ్కర్‌ 4,561 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 3 ఏప్రిల్‌ 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 ఏప్రిల్‌ 1956 వరకూ కొనసాగారు. ఈ మధ్యలో 1954లో బాంద్రా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్కర్‌ విజయం సాధించారు.

తెగేసి చెప్పేసిన నిజామాబాద్ రైతులు

నిజామాబాద్‌ పార్లమెంటు బరిలో తామంతా ఉండాలని నామినేషన్లు వేసిన రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా రైతు సంఘాలు తీర్మానం చేశాయి. దీంతో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధ, గురువారాలు గడువు నిర్ణయించగా తొలిరోజు ఒక్కరూ ఉపసంహరణకు ముందుకు రాలేదు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేల్చారు. వీరిలో భాజపా, కాంగ్రెస్‌, తెరాస, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా.. మిగతా వారంతా రైతులే. మంగళవారం రిటర్నింగ్‌ అధికారి చేపట్టిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు సాగింది. మొత్తం 14 మందికి చెందిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అఫిడవిట్‌, వివరాలు సరిగా నింపని కారణంగా వీటిని తిరస్కరించినట్లు వెల్లడించారు.

మూర్ఖుల దినోత్సవం నాడు హైదరాబాద్ నడిబొడ్డున మోడీ సభ

ప్రధాని మోదీ ఈనెల 29న మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ ప్రచార షెడ్యూల్‌ సైతం ఖరారైందని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..‘‘అమిత్‌షా ఏప్రిల్‌ 4న.. కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 6న నల్గొండతోపాటు హైదరాబాద్‌లో రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు’’ అని వివరించారు. మోదీని విమర్శిస్తే గొప్ప నాయకుడు అవుతానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భ్రమ పడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. ‘‘మే 23న ఫలితాల తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడం, మోదీ మళ్లీ ప్రధాని అవడం ఖాయం. రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమా’’ అని కేటీఆర్‌కు లక్ష్మణ్‌ సవాలు విసిరారు. ‘‘కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. మీ భరతం పడతాం. మీ అవినీతికి, కుటుంబ పాలనకు స్వస్తిపలుకుతాం’’ అని తెరాసను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం అభివృద్ధి అజెండాతో వెళ్తుంటే కేసీఆర్‌ ప్రజల దృష్టి మారుస్తూ తానే అసలైన హిందువుగా చెబుతున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది భక్తులు మరణిస్తే పరామర్శించని మీరు హిందువు ఎలా అవుతారు? అసదుద్దీన్‌తో పోలిస్తే గడ్డం లేదుకానీ, అతడిని మించిన ముస్లిం మీరు. ప్రశ్నించిన ఎంపీలను పక్కన పెట్టారు. భజనపరులకు, డబ్బు సంచులు ఇచ్చినవారికి వేలంపాటను బట్టి లోక్‌సభ టికెట్లు ఇచ్చారు’’ అని సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్‌ నిప్పులుచెరిగారు. ‘‘ఉపాధ్యాయులు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తెరాసకు గుణపాఠం చెప్పారు. ‘కారు’ గాలిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో పంక్చర్‌ కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాల కోసం భాజపా దేశవ్యాప్తంగా ‘భారత్‌కీ మన్‌కీ బాత్‌, మోదీ కీ సాత్‌’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఐటీ ఉద్యోగులు, మహిళలు, వివిధవర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ‘తెలంగాణ మన్‌కీ బాత్‌’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కమిటీ సభ్యులు అందించారు. వీటిని పార్టీ జాతీయ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌కు గురువారం అందించనున్నట్లు లక్ష్మణ్‌ తెలిపారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ముంబయి ఉత్తర ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు నటి ఊర్మిళ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గురించి అప్పుడప్పుడూ ఆయన సోషల్‌మీడియాలో మాట్లాడుతుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌ను షేర్‌ చేసి.. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే బుధవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఊర్మిళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ వార్త తనను ఎంతో థ్రిల్‌ చేసిందని వర్మ అన్నారు. ఈ మేరకు ఊర్మిళ, రాహుల్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్‌ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు’ అంటూ ‘రంగీలా’లోని ‘యాయిరే యాయిరే…’ పాట లిరిక్స్‌ను జత చేశారు. వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ, ఆమిర్‌ ఖాన్‌ నటించారు. 1995లో ఈ సినిమా విడుదలై, హిట్‌ అందుకుంది.

నేను ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

పోలింగ్‌ పూర్తయిన శాసనమండలి స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 22న మూడు స్థానాలకు పోలింగ్‌ పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 59.03 శాతం పోలింగ్‌ నమోదైంది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 89.25 శాతం, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌- కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 83.54 శాతం పోలింగ్‌ నమోదైంది. పట్టభద్రుల స్థానం, ఒక ఉపాధ్యాయ మండలి స్థానానికి కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో ఉపాధ్యాయ మండలి స్థానానికి లెక్కింపు నల్గొండలో చేపట్టనున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. లోక్‌సభ ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున సీఈసీ అనుమతి ఇచ్చాకే ఫలితాలు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలను అధికారంగా ప్రకటించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో తెలుగు బాలికపై అత్యాచారం. అనంతరం అబార్షన్!

దేశ రాజధాని దిల్లీలో తెలుగు బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం దిల్లీ పోలీసులు ఏపీ భవన్‌ అధికారులను సంప్రదించారు. ‘‘గురుటేక్‌ నగర్‌లో నిస్సహాయంగా ఉన్న 16 ఏళ్ల బాలికను గుర్తించాం. ఆ బాలికకు ఇటీవలే అబార్షన్‌ చేసినట్లుగా ఉంది. గతంలో ఎవరో అత్యాచారం చేసి తదనంతరం అబార్షన్‌ చేసినట్టుగా భావిస్తున్నాం. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రశ్నించాం. హిందీ, ఆంగ్ల భాషలను అర్థం చేసుకోలేకపోతోంది. తెలుగు మాట్లాడుతోంది. కేసు నమోదు చేశాం. కోర్టులో మంగళవారం విచారణకు రానుంది. హిందీ, తెలుగు అర్థం చేసుకొనే వ్యక్తిని దుబాసీగా పంపగలరు’’ అని భవన్‌ అధికారులను దిల్లీ పోలీసులు కోరారు. పూర్తి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.

బీజేపీ అభ్యర్థిగా జయప్రద

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఆమె సోమవారం బీజేపీలో చేరుతారని, యూపీలోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఆమెను కమలం పార్టీ బరిలోకి దింపే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద.. రాంపూర్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ రాంపూర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకే పార్టీలో కొనసాగిన జయప్రద-ఆజం ఖాన్‌ మధ్య బద్ధ వైరం నెలకొని ఉంది. తనపై యాసిడ్‌ దాడి చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించాడంటూ.. ఆయనపై జయప్రద గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద.. అనంతరం చంద్రబాబునాయుడితో విభేదించి.. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్‌ నటిగా మంచి పేరు ఉండటంతో 2004లో ఆమెకు రాంపూర్‌ టికెట్‌ను ఎస్పీ కేటాయించింది. దీంతో మొదటిసారి ఎంపీగా గెలుపొందిన ఆమె.. అనంతరం ఎస్పీ అధినాయకత్వంతో విభేదించి తన సన్నిహితుడైన అమర్‌సింగ్‌తో కలిసి పార్టీని వీడారు. రాజకీయాల్లో అమర్‌సింగ్‌ను తన గాడ్‌ఫాదర్‌గా జయప్రద చెప్పుకుంటారు. వీరి సన్నిహిత్యంపై పలు విమర్శలు వచ్చినా.. ఆమె పెద్దగా పట్టించుకోరు.

“భారతరత్న” పారికర్?

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పేరును వచ్చే సంవత్సరానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించే యోచనలో గోవా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆయన అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అక్కడి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీనిపై ఆయన త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు. పారికర్‌కి అత్యంత సన్నిహితుల్లో ప్రమోద్‌ సావంత్ ఒకరు. ఈ నిర్ణయాన్ని భాజపా నేత, పార్టీ అధికార ప్రతినిధి శయినా ఎన్‌సీ స్వాగతించారు. గోవా ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి పారికర్‌ సేవలు అందించారన్నారు. ఎంతో మందికి ఆయన స్పూర్తిగా నిలిచారన్నారు. భారతరత్న ఇవ్వడం పారికర్‌కి సరైన నివాళి అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే భాగస్వామ్య పక్షాలు కూడా నిర్ణయాన్ని స్వాగతిస్తాయని భాజపా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ గోవాలో నిర్మించిన ఓ నూతన వంతెనకు పారికర్‌ పేరుతో నామకరణం చేయాలని మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ నేత, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సుధిన్‌ ధావలికర్‌ నిర్ణయించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో మార్చి 17న మనోహర్‌ పారికర్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే.

బెంగుళూరులో మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకోండి

వేలకోట‍్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోయిన ప్యుజిటివ్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు మరో షాక్‌ తగిలింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఢిల్లీ హైకోర్టు శనివారం ఆదేశించింది. తదుపరి విచారణకు జూలై 10 వ తేదీనికి వాయిదా వేసింది. జూలై 10వ తేదీ నాటికి ఆస్తులను అటాచ్ చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ బెంగళూరు పోలీసులు ఆదేశించారు.ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి ఇప్పటికే అధికారులు తెలియజేశారు. గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే. కాగా రూ.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్‌ మాల్యా లండన్‌కు పారిపోయాడు. అయితే ఈ కేసులో మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నిస్తున్నాయి

ఫూల్స్ డే నాడు రాజమండ్రి రానున్న మోడీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి ఏపీకి రానున్నారు. ఏప్రిల్‌ 1న రాజమహేంద్రవరంలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడి స్పిన్నింగ్‌ మిల్లు మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారని భాజపా నేత సోము వీర్రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే సీఎం చంద్రబాబు 2లక్షలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతోంది రూలింగ్‌ కాదు.. ట్రేడింగ్‌ అని ఆరోపించారు.

మే 19 సాయంకాలం మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి పెరుగడంతో ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది.

మే 19వ తేదీ సాయంత్రం లోక్‌సభ తుది విడుత పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలని ఈసీ స్పష్టం చేసింది.

ఈ మేరకు మీడియాతోపాటు తొలిసారి వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలకు శనివారం సూచనలను జారీ చేసింది.

ఏడు దశల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దశ పూర్తికావడానికి ముందు 48 గంటల వ్యవధిలో ఏ పార్టీకి, అభ్యర్థికి అనుకూలమైన లేదా వ్యతిరేకమైన కార్యక్రమాలను, అభిప్రాయాలను, విజ్ఞప్తులను ప్రసారం చేయరాదని టీవీ, రేడియో చానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలకు ఈసీ సూచించింది.

లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలకు కూడా ఈ సూచన వర్తిస్తుంది.

ఇందుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 126(ఏ) సెక్షన్‌ను ఈసీ అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ సెక్షన్ ప్రకారం తొలి విడుత పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తుది విడుత పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించడం, వాటి ఫలితాలను వెల్లడించడం నిషిద్ధం.

ఒపీనియన్ పోల్స్ ప్రదర్శనతోపాటు ప్రామాణిక చర్చలు, విశ్లేషణలు, విజువల్, సౌండ్ బైట్స్‌కు కూడా ఈ సూచన వర్తిస్తుందని ఈసీ పేర్కొంది.

రేణుకకు ఖమ్మం కాంగ్రెస్ సీటు

తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న విషయమై తర్జనభర్జన పడిన కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరికి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరివైపే మొగ్గుచూపింది. ఈ స్థానం నుంచి బలమైన ప్రత్యర్థులు రంగంలో ఉండడంతో ఒక దశలో వేరొకరిని బరిలోకి దించాలని కాంగ్రెస్‌ అధినాయకులు యోచించారు. టికెట్‌ కోసం పోటీ పడుతున్న పోట్ల నాగేశ్వరరావు, రవిచంద్రతోపాటు టీఆర్‌ఎస్‌ లో టికెట్ రాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా పరిశీలించారు. దీంతో మొత్తం 17 నియోజకవర్గాల్లో రెండు విడతల్లో 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం ఖమ్మం స్థానాన్ని పెండింగ్‌లో పెట్టి ఊహాగానాలకు తెరదీసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో దీటైన పోటీ ఇవ్వాలంటే రేణుకాచౌదరి అయితేనే బెటర్‌ అన్న ఉద్దేశంతో శుక్రవారం రాత్రి జాబితాలో ఆమె పేరు చేర్చి విడుదల చేశారు.

నాకు లేని రోగం లేదు. నేను రాను. రాలేను.

అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను భారత్‌కు తిరిగి రాలేనని, ప్రయాణం చేసే పరిస్థితుల్లో కూడా లేనని ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ముంబయి కోర్టుకు విన్నవించాడు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశాడు. తనకు చాలా రోగాలున్నాయని, ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లలేనని, ప్రయాణం అస్సలు చేయలేనని చెప్పాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన నీరవ్‌ మోదీ, అతని మామ మెహుల్‌ చోక్సీ విదేశాలకు పారిపోయి అక్కడ పౌరసత్వాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నీరవ్‌మోదీ లండన్‌లో పట్టుబడ్డాడు. దీంతో ఇప్పుడు మెహుల్‌ చోక్సీ ఈ విధంగా స్పందించడం కోర్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంగానే కనిపిస్తుంది. మళ్లీ ఈ కేసు ఏప్రిల్‌ 9న విచారణకు రానుంది. తాను ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేడని నమ్మించేందుకు 38 పత్రాలను న్యాయస్థానం ముందుంచాడు. వాటిలో మెడికల్‌ రిపోర్టులు, ఇతనికి ఉన్న వ్యాధులకు చికిత్సల కోసం వైద్యులు వేరొక ఆసుపత్రికి సిఫారసు చేస్తూ రాసిన లేఖలు ఉన్నాయి. రక్త కణాలు సరిగా లేవని చూపించేందుకు ఆంజియోగ్రామ్స్, అల్డ్రా సౌండ్‌ నివేదికలు, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టు, మోకాళ్ల జాయింట్లు, వెన్నెముక సరిగా లేవని తెలిపే రిపోర్టులు, రక్త పరీక్షల రిపోర్టులు, వెన్నెముకకు సంబంధించిన రేడియోగ్రాఫ్‌లు, ఎక్స్‌రేలు, వైద్యులను సంప్రదించినట్లు తెలిపే పత్రాలను అతని తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఇన్ని వ్యాధులు చుట్టుముట్టినందున చోక్సీ భారత్‌కు తిరిగి రాలేరని అతని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మెహుల్‌ చోక్సీపై న్యాయస్థానం తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అతని న్యాయవాది అన్నారు. అతను చేసింది ఆర్థిక నేరమే కాబట్టి దానికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేయడం తగదంటూ వాదించారు.

రూపాయి ఉందా? పదండి భోజనం చేద్దాం!

కర్ణాటక హుబ్బళ్లి నగరంలోని మహావీర్‌ వీధిలో ఒక్కరూపాయికే మంచి భోజనం లభిస్తుంది. ఈ సంస్థ దాదాపు తొమ్మిదేళ్ల క్రితం మహావీర్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. 1998లో మహావీర్‌ యువజన సమాఖ్య ఏర్పడి పలు సేవాకార్యక్రమాలు తెలుస్తోంది. ఓ జైన గురువు సలహామేరకు 2009లో ఇక్కడ రోటీఘర్‌ను ప్రారంభించారు. ఈ రోటీఘర్‌లో ఒక్కరూపాయికే కమ్మని భోజనం పెడతారు.

ఆయనకు 350. ఈయనకు 80.

విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొట్లూరి వర ప్రసాద్‌(పీవీపీ) కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లుగా ప్రకటించారు. వీటిలో చరాస్తులు రూ.236.29కోట్లు, స్థిరాస్తులు రూ.111.46కోట్లు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేసిన పీవీపీ.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. కుటుంబానికి ఉన్న అప్పులు రూ.20.95 కోట్లుగా చూపించారు. మరో రూ.7.36 కోట్ల వివాదాస్పద బకాయిలు ఉన్నట్టు పొందుపరిచారు. పీవీపీ పేరుతో రూ.39.36 కోట్లు, భార్యకు 196.60కోట్లు, ఇద్దరు పిల్లలకు రూ.32.95లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. పీవీపీకి రూ.45.95 కోట్లు, భార్యకు రూ.65.51 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అప్పులు సైతం పీవీపీ పేరుతో రూ.2.91 కోట్లు, భార్యకు రూ.18.03 కోట్లు ఉన్నట్టు చూపించారు. 2017-18లో పన్ను చెల్లించిన కుటుంబ ఆదాయం రూ.1.49కోట్లుగా పొందుపరిచారు. రూ.18.90లక్షల విలువైన 630గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఇన్నోవా వాహనం ఉన్నట్టు చూపించారు. తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌(నాని) దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.80.82 కోట్లుగా చూపించారు. నాని పేరుతో అప్పులు రూ.51.23 కోట్లున్నాయి. మరో రూ.23.29 కోట్ల వివాదాస్పద బకాయిలు సైతం ఉన్నట్టు పొందుపరిచారు. చరాస్తులు నాని పేరుతో రూ.10.62కోట్లు, భార్యకు రూ.1.61కోట్లు, కుమార్తెలకు రూ.1.13కోట్ల విలువైనవి ఉన్నాయి. స్థిరాస్తులు నాని పేరు మీద రూ.66.07కోట్లు, భార్యకు రూ.1.36కోట్ల విలువైనవి ఉన్నట్టు పొందుపరిచారు. 2017-18లో పన్ను చెల్లించిన కుటుంబ ఆదాయం రూ.26.87లక్షలుగా చూపించారు. ఐదు వోల్వో, ఆరు మినీ బస్సులు, రెండు బెంజ్‌ కార్లు, ఆడి ఎస్‌యూవీ, బీఎండబ్ల్యూ, ఇన్నోవాలు 4, స్కార్పియో, బొలేరో వాహనాలు ఉన్నాయి. రూ.3.41 కోట్ల విలువైన 3.85కిలోల బంగారం, రూ.10లక్షల విలువైన 25కిలోల వెండి వస్తువులు ఉన్నాయి.

కేరళ నుండి రాహుల్ పోటీ

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తారని కొన్ని రోజుల కిందట వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రాహుల్‌ కేరళలోని వైనాడ్ నియోజవర్గం నుంచి లోక్‌ సభకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈవి షయాన్ని కేరళ కాంగ్రెస్‌ ఛీఫ్‌ ముల్లప్పల్లి రామచంద్రన్‌ శనివారం మీడియాకు తెలిపారు. వైనాడ్‌ నుంచి పోటీ చేసేందుకు రాహుల్‌ అంగీకరించారని రామచంద్రన్‌ పేర్కొన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్‌ నేతల కోరిక మేరకు రాహుల్‌ కర్ణాటక నుంచి పోటీ చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. గతవారంలో రాహుల్‌ ఆ రాష్ట్రంలో పర్యటించారు. అప్పుడు కన్నడ నాట కాంగ్రెస్‌ నేతలు ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పట్టు నిలుపుకోవాలంటే ఉత్తరాదితో పాటు దక్షిణాది కూడా ముఖ్యమైందని భావించి రాహుల్‌ రెండు చోట్లా పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అమేఠీలో భాజపా తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించని విషయం తెలిసిందే.

ఏపీ భాజపా జాబితా విడుదల

భాజపా అభ్యర్థుల జాబితా విడుదల. 23 లోక్‌సభ, 51 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా నుంచి పోటీ చేసే లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించింది. 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ఖరారు చేశారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన పి.మాణిక్యాలరావును నరసాపురం ఎంపీ అభ్యర్థిగా భాజపా ప్రకటించింది.

******* లోక్‌సభ అభ్యర్థులు *******

అరకు: కేవీవీ సత్యనారాయణ

శ్రీకాకుళం: పెర్ల సాంబమూర్తి

విజయనగరం: పి.సన్యాసిరాజు

అనకాపల్లి: వెంకట సత్యనారాయణ

కాకినాడ: వెంకటరామ్మోహన్‌రావు

అమలాపురం: మానేపల్లి అయ్యాజి వేమ

రాజమహేంద్రవరం: సత్యగోపీనాథ్‌

నరసాపురం:మాణిక్యాలరావు

ఏలూరు: చిన్నం రామకోటయ్య

మచిలీపట్నం: గుడివాక రామాంజనేయులు

విజయవాడ: కిలారు దిలీప్‌ కుమార్‌

గుంటూరు: వల్లూరు జయప్రకాశ్‌నారాయణ

బాపట్ల: చల్లగాలి కిశోర్‌కుమార్‌

ఒంగోలు: తోగుంట శ్రీనివాస్‌

నంద్యాల: డాక్టర్‌ ఆదినారాయణ

కర్నూలు: పి.వి. పార్థసారథి

అనంతపురం: దేవినేని హంస

హిందూపురం: పొగాల వెంకట పార్థసారథి

కడప: సింగారెడ్డి రామచంద్రారెడ్డి

నెల్లూరు: సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి

తిరుపతి: బొమ్మి శ్రీహరిరావు

రాజంపేట: పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి

చిత్తూరు: దుగ్గాని జయరామ్‌

******* అసెంబ్లీ అభ్యర్థులు.. *******

పలాస: కె.బాలకృష్ణ

ఆమదాలవలస: పతిన గద్దెయ్య

నరసన్నపేట: భాగ్యలక్ష్మి

గజపతినగరం: డాక్టర్‌ పి.జగన్‌మోహన్‌రావు

విజయనగరం: సుబ్బారావు

విశాఖపట్నం తూర్పు: సుహాసిని ఆనంద్‌

చోడవరం: మొల్లి వెంకటరమణ

మాడుగుల: విజయలక్ష్మి

తుని: ఈశ్వర్‌రావు

రంపచోడవరం: టి.సుబ్బారావు

రాజమహేంద్రవరం గ్రామీణం: ఆకుల శ్రీధర్‌

భీమవరం: కాగిత సురేంద్ర

తాడేపల్లిగూడెం: ప్రభాకర బాలాజీ

ఉంగుటూరు: ఉదయ్‌భాస్కర్‌

గోపాలపురం: దున్న సుమన్‌బాబు

పోలవరం: బి.వెంకటలక్ష్మి

గన్నవరం: గద్దిరాజు రామరాజు

కైకలూరు: వెంకటరామ ప్రసాద్‌

మచిలీపట్నం: పి.వెంకటగజేంద్ర

అవనిగడ్డ: జి.వి.నగరాయులు

పెనమలూరు: గోపిశెట్టి దుర్గాప్రసాద్‌

విజయవాడ తూర్పు: వంగవీటి నరేంద్ర

పెదకూరపాడు: కోటేశ్వరరావు

రేపల్లె: నాగిశెట్టి హర్షవర్ధన్‌

బాపట్ల: షేక్‌ కరీముల్లా

నరసరావుపేట: రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్‌

గురజాల: పుల్లయ్య యాదవ్‌

మాచర్ల: అమర సైదారావు

యర్రగొండపాలెం: అంగలకుర్తి చెన్నయ్య

అద్దంకి: ఉండవల్లి కృష్ణారావు

చీరాల: మువ్వల వెంకటరమణ

కందుకూరు: చంద్రగిరి వెంకటేశ్వరరావు

గిద్దలూరు: వేమిరెడ్డి రామచంద్రారెడ్డి

నెల్లూరు గ్రామీణం: కరణం భాస్కర్‌

సర్వేపల్లి: మస్తాన్‌గౌడ్‌

గూడూరు: పరిచెర్ల బైరప్ప

వెంకటగిరి: ఎస్‌.ఎస్‌.ఆర్‌ నాయుడు

పులివెందుల: పెరవలి సుష్మ

కమలాపురం: పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి

పాణ్యం: జీఎస్‌ నాగరాజ

నంద్యాల మలికిరెడ్డి శివశంకర్‌

బనగానపల్లె: బిజిగల లింగన్న

డోన్‌: సందు వెంకటరమణ

పత్తికొండ: రంగాగౌడ్‌

హిందూపురం: పీడీ పార్థసారథి

పెనుకొండ: జీఎం శేఖర్‌

పుట్టపర్తి: హనుమంతరెడ్డి

ధర్మవరం: సుదర్శన్‌రెడ్డి

కదిరి: నాగేంద్రప్రసాద్‌

తిరుపతి: వి.భవానీశంకర్‌

నగరి: నిశిధరాజు

ఢిల్లీ భాజపా సీఎం అభ్యర్థిగా గౌతీ!

కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా గంభీర్ ను ప్రకటించే అవకాశం!

యూపీలో క్వింటా బంగారం పట్టివేత

ఘ‌జియాబాద్ జిల్లాలో ఓ వాహ‌నం నుంచి వంద కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోదీన‌గ‌ర్‌లో చెకింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసులు ఆ వాహ‌నాన్ని సీజ్ చేశారు.

దాదాపు 38 కోట్లు ఖ‌రీదు చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధం ఉన్న న‌లుగుర్ని అరెస్టు చేశారు.

ఢిల్లీ నుంచి హ‌రిద్వార్‌కు బంగారాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. క్యాషియ‌ర్‌, డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు సెక్యూర్టీ గార్డుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ పోయిన అరుణ. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి సై!

కాంగ్రెస్ కు కు మరో భారీ షాక్ ..

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న మాజీ మంత్రి డీకే అరుణ ..

బీజేపీ కి టచ్ లోకి వెళ్లిన డీకే అరుణ ..

ఈ ఉదయం డీకే అరుణ ఇంటికి వెళ్లిన రామ్ మాధవ్ ..

45 నిమిషాలకు పైగా మంతనాలు ..

ఫోన్ లో అమిత్ షాతో మాట్లాడించిన రామ్ మాధవ్ ..

డీకే రాజకీయ భవిష్యత్తుపై పూర్తి భరోసా ఇచ్చిన అమిత్ షా ..

అనంతరం ఢిల్లీ వెళ్లిన డీకే అరుణ ..

మరికాసేపట్లో బీజేపీ జాతీయ నాయకత్వంలో భేటి ..

మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ..

రాజీవ్ హంతకులను విడిపిస్తాం!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడిపించేందుకు కృషి చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మంగళవారం విడుదల చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే సంకీర్ణ కూటమిలో తమ పార్టీ ఉంటే.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడిపించేందుకు డీఎంకే కచ్చితంగా ప్రయత్నాలు చేస్తుందని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని, వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ను రద్దు చేస్తామని, ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్‌ కోటాను తీసుకొస్తామని డీఎంకే హామీలు కురిపించింది. దీంతో పాటు విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాలను కూడా మాఫీ చేస్తామని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని హమీ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో డీఎంకే.. కాంగ్రెస్‌, ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా డీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగతా 19 సీట్లను కూటమి పార్టీలకు కేటాయించింది. ఏప్రిల్‌ 18న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

పాక్ అణు స్థావరంలో ప్రమాదం

అణుపాటవ దేశాలు తమ అణ్వాయుధాలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. కానీ పాక్‌ పరిస్థితి వేరు. ఆ దేశంలో అణుటెక్నాలజీ కూడా సరిహద్దులు దాటేస్తుంది. ఉత్తరకొరియా అణుకార్యక్రమం పాక్‌ పాపమేనని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ దేశంలోని కీలకమైన అణుస్థావరంలో ప్రమాదం చోటు చేసుకొందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదీ జరిగినా బాహ్య ప్రపంచానికి తెలియనీయని పాక్‌ ఇప్పుడు ప్రమాదం విషయాన్ని కూడా తొక్కిపడుతోంది. తాజాగా అక్కడి ఉపగ్రహ చిత్రాలను ఒక ఆంగ్లపత్రిక బహిర్గతం చేసింది.
ఫిబ్రవరి 26 దాడుల తర్వాత పాక్‌ అణుస్థావరాల్లో ఏమైనా కదలిక వచ్చిందా అని నిపుణులు పరిశీలించారు. దీనికోసం వారు పలు ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా బలోచిస్థాన్‌ ప్రాంతంలో ఖుస్దార్‌ అణ్వాయుధ కేంద్రంలో చిత్రాలు తేడాగా అనిపించాయి. ఖుస్దార్‌ అణ్వాయుధ కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ఇక్కడి నిర్మాణాలను తీరును బట్టి 46 అణవార్‌ హెడ్లను భద్రపర్చినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి 200 వార్‌హెడ్లను, క్షిపణులను భద్రపర్చే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. మార్చి 8వ తేదీన ఇక్కడి శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించిన వారికి 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో అగ్నిప్రమాదం జరిగినట్లు నల్లటి మచ్చ కనిపించింది. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ఏదైనా ప్రమాదానికి గురై పేలి ఉండవచ్చని భావిస్తున్నారు. కచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందో మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు. అక్కడ నిజంగా ప్రమాదం జరిగితే కనుక అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది.

ఎంపీ సీటు కోసం రెండు సార్లు వివేకాను కొట్టిన జగన్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం ద్వారా జగన్‌ సానుభూతి పొందాలని చూస్తున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ పేర్కొన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని కూడా అలాగే ఉపయోగించుకోవాలని చూశారన్నారు. వివేకానందరెడ్డి మరణానంతర పరిణామాలపై ఆయన ఫేస్‌బుక్‌లో కామెంట్లను పోస్టు చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన బాబాయి వివేకానందరెడ్డిపై రెండుసార్లు చేయిచేసుకున్నారని..ఈ విషయం తనతో పాటు అప్పట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు అందరికీ తెలుసునని హర్షకుమార్‌ అందులో వెల్లడించారు. 2006లో వైఎస్‌ వివేకానందరెడ్డి రాజీనామా విషయంలో జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావించారు. ‘కాంగ్రెస్‌ ఎంపీలంతా పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉన్న సమయంలో రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌కు ఫోన్‌ వచ్చింది. నేను వెంటనే వెళ్లాలి.. మన వివేకా రాజీనామా చేశాడు. ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నాడు. సోనియాగాంధీ ఆయనను తీసుకురమ్మన్నారని చెబుతూ.. ఆయన వివేకానందరెడ్డిని విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన విషయాన్ని’ గుర్తుచేశారు. ‘వివేకానందరెడ్డి ఎవరికీ తెలియకుండా స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ వద్దకు వెళ్లి రాజీనామా చేసి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. దీంతో స్పీకర్‌ వెంటనే సోనియాగాంధీకి ఫోన్‌చేసి విషయం చెప్పారు. సాయిప్రతాప్‌ ద్వారా వివేకాను పిలిపించి సోనియా కారణం అడిగితే..ఇది మా నాన్న సీటు నువ్వు ఎంత కాలం ఉంటావ్‌ అని అప్పటికే రెండుసార్లు జగన్‌ తనపై చేయిచేసుకున్నాడు’ అని మేడంకు వివేకానందరెడ్డి వివరించారని వెల్లడించారు. సోనియాగాంధీ వెంటనే రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ‘మీ కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోండి.. ఇలా చేస్తే జగన్‌కు సీటు ఇవ్వనని హెచ్చరించగా.. తాను చెబుతూనే ఉన్నానంటూ సోనియాకు వైఎస్‌ క్షమాపణ కూడా చెప్పారు’ అని తెలిపారు. 2009లో జగన్‌ ఎంపీ అయ్యారని, ఈ విషయాలన్నీ అప్పటి రాష్ట్ర ఎంపీలందరికీ తెలుసని ఫేస్‌బుక్‌లో హర్షకుమార్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని హర్షకుమార్‌ వద్ద ప్రస్తావించగా ‘ఫేస్‌బుక్‌లో నేనే పోస్టు చేశానని.. ఇది కొత్త విషయం కాదని, అప్పట్లో అందరికీ తెలిసిందేనని’ ఆయన స్పష్టం చేశారు.

మనోహర్ పారికర్ మృతి

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.